లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు చెప్పే గురువులకు ఇవేం విధులు? ప్రభుత్వం బాధ్యతను విస్మరించి గురువులకు ఇలాంటి పనులను అప్పగిస్తుందా అని ప్రశ్నించారు. కరోనా విధులకు వారిని ఉపయోగించుకోవాలనుంటే పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షణకు లేదా ప్రజలకు కరోనావ్యాధిపై అవగాహన కల్పించేందుకు వినియోగించుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు వ్యక్తిగత దూరం పాటించాలనే దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా వ్యక్తిగత దూరం అనే నియమాన్ని తుంగలో తొక్కిందని చెప్పారు. మంగళవారం నాడు చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలో నెలకున్న పరిస్థితులను సమీక్షించారు.
“శ్రీకాళహస్తిలాంటి చోట్ల ప్రజాప్రతినిధులు చేసిన ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు వారెంత బాధ్యతారాహిత్యంతో ఉంటున్నారో వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకులతో నిన్ననే రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడాను. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేయడం, ఆ దుకాణాల దగ్గర జనం వేలంవెర్రిగా ఉన్నా కట్టడి చేయకుండా వదిలేయడం, ప్రజా ప్రతినిధులు ర్యాలీలు చేయడం గురించి వారు ప్రస్తావించి ‘ఆంధ్ర ప్రదేశ్ కరోనా ఫ్రెండ్లీ స్టేట్’ అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మనవైపు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం గోడ కట్టేసింది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాము జాగ్రత్తలు తీసుకోకపోతే కర్నూల్, గుంటూరు జిల్లా అయ్యేది అన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రప్రభుత్వానికి కరోనా కట్టడిపై చిత్తశుద్ధి లేదని వెల్లడవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu