ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ చేపడుతున్న చర్యలకు మద్దతుగా పలువురు ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ మార్చ్ 27 , శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలుసుకుని ఇందుకు సంబంధించిన చెక్కును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, తనవంతు సాయంగా రూ.5 కోట్ల విరాళాన్ని అందించానని ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా రూ. 20 లక్షల విరాళంప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు.