విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన రసాయన వాయువును అదుపుచేయడానికి అన్నివిధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి సందర్శించారు. అలాగే ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై సమీక్ష నిర్వహించి, ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ప్రతినిధులు, ఇతర నిపుణులతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్యాస్ లీకేజ్ వలన ఏర్పడ్డ పరిస్థితి 48 గంటల్లో పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. ట్యాంక్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల కన్నా తక్కువగా ఉందని, ఇంకా కొన్ని రసాయనాలు వాడి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని చెప్పారు. స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉందని, గాలిలో సాంద్రత జీరో లెవెల్కు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్ ప్రభావం లేకుండా 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఇలాంటి కంపెనీలు 86 ఉన్నట్లు గుర్తించామని, పూర్తిస్థాయిలో భద్రత ప్రమాణాలు పరిశీలించాకే వాటికీ ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu