తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితీ చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి హమాలీలకు పూలతో స్వాగతం పలికారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి.సత్యనారాయణ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ లు హమాలీలకు కోవిడ్ పరీక్షలు, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోంది. పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కరోనా లాక్ డౌన్ వల్ల హమాలీల సమస్య ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు 2 వేల రైస్ మిల్లుల్లో అధికశాతం మంది బీహార్ నుంచి వచ్చిన హమాలీలే పనిచేస్తున్నారు.
ముందుగా హెూళీ పండుగకు వారు తమ స్వంత రాష్ట్రమైన బీహార్కు వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణ సమయంలో కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. హమాలీల కొరతతో ఎఫ్సిఐ కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇదే విషయాన్ని పౌరసరఫరాల శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని నోడల్ అధికారిగా నియమించింది. బీహార్ ప్రభుత్వం రామచంద్రుడు ఐఏఎస్ ను నోడల్ అధికారిగా నియమించింది. రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్, జిల్లా అసోసియేషన్ తో పౌరసరఫరాల సంస్థ అధికారులు మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన హమాలీల జాబితాను రూపొందించారు. ఈ జాబితాను బీహార్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది.
ఇందులో భాగంగా మొదటి విడతలో బీహార్ నుంచి 300 హమాలీలు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక రైలులో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరికి రైలు దిగిన వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వచ్చిన హమాలీలకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం వారిని నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్ పూర్ కాగజ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఒక్కో ఆర్టీసీ బస్సులో 20 మంది చొప్పున తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హమాలీల రాకతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోల్లు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్న సమయంలో బీహార్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి హమాలీలు రావడం సంతోషదాయకం. తెలంగాణలో ఉపాధి లభిస్తుందని ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో హమాలీలు రాష్ట్రానికి వచ్చారు. వీరందరిని కూడా తెలంగాణ బిడ్డల్లా చూసుకుంటామన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వలస కార్మికులను చాలా గొప్పగా చూసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో వలస కార్మికునికి రూ. 500 నగదు, 12 కిలోల ఉచిత బియ్యం అందించి వారికి భరోసా కల్పించామన్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హమాలీలను బీహార్ నుంచి తీసుకు రావడం జరిగింది. మరో ఐదారు వేల మంది హమాలీలను తీసుకురావడనికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా హమాలీల సమస్యను అధిగమిస్తున్నామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu