వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. గురువారం ఆయన తన నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు-తాటిపర్తి రహదారి పొట్టేపాళెం వద్ద కలుజుపై వంతెన నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ గురువారం జలదీక్షకు పిలుపునిచ్చారు. దీక్షలో భాగంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కలుజులోని నీళ్లలో కూర్చొని నిరహార దీక్షతో తన నిరసన తెలియజేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం వంతెన వద్దకు బయలుదేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో దీనికి నిరసనగా ఆయన ఇంటి ఎదుటే దీక్షకు దిగారు. దీంతో మాగుంట లే అవుట్ లోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు గేటు వద్దే బైఠాయించి నిరసన తెలియజేశారు. పోలీసుల వైఖరిపై మండిపడిన ఆయన ఒక డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని రౌండప్ చేస్తారా? అని ప్రశ్నించారు. దీక్షకు సంబంధించి ముందుగానే ఎస్పీ, డీఎస్పీని అనుమతి కోరానని, ఏదైనా సమస్య ఉంటే తనను పిలిచి వివరణ అడిగి ఉండొచ్చని, ఇలా ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బందించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏడాదిన్నర క్రితం సీఎం జగన్ ఈ ప్రాంతంలో పర్యటించి వివిధ పనుల నిమిత్తం రూ.28 కోట్లు మంజూరు చేశారని, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. ఇక వంతెన నిర్మాణానికి సీఎం జగన్ ఆల్రెడీ ఫైల్ మీద సంతకం చేశారని, జీవో ఇప్పిస్తే వచ్చి పూలమాల వేసి ఆయనను సత్కరిస్తానని చెప్పారు. పోలీసులు డ్యూటీలు మానేసి ఎంతో కాలం తన వెనుక తిరగలేరని, అనుమతులు వచ్చినా.. రాకున్నా ఈరోజు జలదీక్ష నిర్వహించి తీరుతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE