ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఆందోళనలు, రాత్రి వరకు కొనసాగాయి. అమలాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పినేపి విశ్వరూప్, ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇండ్లకు ఆందోళనకారులు పెట్టారు, అలాగే పలు ప్రభుత్వ బస్సులను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో అమలాపురంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, ఈ ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని ఆయన కోరారు.
“అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాను. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైంది. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF