ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలవాల్సిన వ్యక్తుల్లో ఎంపీ రఘురామకృష్ణం రాజు ఒకరు. గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన.. కొద్దికాలానికి గెలిచిన పార్టీని తిడుతూనే ఉన్నారు. అధికారికంగా వైసీపీ ఎంపీగానే ఉంటున్నా.., ఆ పార్టీ పేరు చెబితే ఫైర్ అవుతూ ఉంటారు. ఆ పార్టీ అధినేత జగన్ ను అయితే.. అనని మాటలు లేవు. ఈనేపథ్యంలో తర్వాతి ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామ పోటీ చేయరని ఎప్పుడో తేలిపోయింది. అయినప్పటికీ కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఏ పార్టీలోనూ చేరలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వస్తుందని చాలాకాలం వెయిట్ చేశారు. నరసాపురం పార్లమెంట్ నుంచే బీజేపీ నుంచి పోటీ చేద్దామని ఆశించారు. కానీ.. బీజేపీ అతడిని పట్టించుకోలేదు. ఆ టికెట్ ను వేరే ఒకరికి కేటాయించింది.
ఇక లాభం లేదనుకుని.. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే సీట్ల ఖరారు నేపథ్యంలో ఎంపీ కాకుండా ఎమ్మెల్యేకు పోటీ దింపే యోచనలో టీడీపీ ఉంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో ఎవరో ఒక అభ్యర్థిని తప్పించి రఘురామకు సీటు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నరసాపురం ఎంపీ సీటును బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీ తరఫున బలహీనమైన అభ్యర్థి బరిలో ఉన్నారనే విమర్శల నేపథ్యంలో ఆయనను మార్చాలని టీడీపీ నేతలు కోరారు. అయితే బీజేపీ ఇందుకు తిరస్కరించింది. తాము ప్రకటించిన అభ్యర్థులను బీజేపీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసిందని అందువల్ల తాము అభ్యర్థులను మార్చేది లేదని, ముందు ప్రకటించినవారే అభ్యర్థులని స్పష్టం చేసింది.
ఈక్రమంలో రఘురామకు సీటు కేటాయింపు డైలమాలో పడింది. ఉండి సీటు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అప్పటికే ఆ సీటును రామరాజు కు కేటాయించారు. రఘురామ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచీ ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉండి నుంచి పోటీ చేసేది నేనే మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నారు. వాస్తవానికి ఉండి సీటును వేటుకూరి వెంకట శివరామరాజు కూడా ఆశించారు. 2014లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును 2019లో నర్సాపురం ఎంపీగా చంద్రబాబు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో ఉండి సీటును వేటుకూరి శివరామరాజు కూడా ఆశించారు. అయితే 2019 ఎన్నికల్లో ఉండి నుంచి గెలిచిన రామరాజుకే సీటు దక్కింది. దీంతో వెంకట శివరామరాజు రెబల్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు రఘురామకృష్ణరాజు ఉండి సీటును ఇస్తే ఇప్పటికే సీటు దక్కించుకున్న రామరాజు సైతం రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఈక్రమంలోనే రామరాజును చంద్రబాబు పిలిచి మాట్లాడినా మెత్తబడలేదని తెలిసింది. మూడు పార్టీల నేతలతో చంద్రబాబు ఉండవల్లిలో జరిపిన సమావేశంలోనూ దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు. అధికారికంగా రఘురామకృష్ణంరాజుకు లైన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో.., ప్రచారం ఎప్పుడు మొదలుపెడతారో.. ప్రచారంలో ఎన్ని అడ్డంకులు వస్తాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE