కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 3 వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాల రూపురేఖలు మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న”నాడు-నేడు” కార్యక్రమంపై ఈ రోజు సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జులై నెల చివరిలోగా నాడు-నేడు కింద మొదటి విడతలో 15,715 స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో కూడా ప్రణాళిక ప్రకారం 9 రకాల సదుపాయాలను కల్పించాలని చెప్పారు. ఇందుకోసం రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశామని సీఎం తెలిపారు. జిల్లా కలెక్టర్లు నాడు-నేడు కార్యక్రమ పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలనీ సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu