వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోందని, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బొబ్బిలి పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని, నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు.
ప్రతినెలా ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి రాష్ట్రం వచ్చిందని, రిటైరైన ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, గృహరుణాలు వంటి బెనిఫిట్స్ అందించలేకపోతున్నారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవం అంత లేదు సీఎం జగన్ వయస్సు అని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు. జగన్ రాజకీయం చేస్తే, తాను రాజకీయం చేస్తానని, అయితే ఆయన కక్ష కట్టి ప్రత్యర్థి పార్టీలను వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఇదే పద్దతి అవలంబిస్తే ఆ పార్టీ నేతలు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహానికి నిదర్శనమని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని విశ్వాసం కలుగుతోందని తెలిపారు.
ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఉత్తరాంధ్రను రాష్ట్ర రాజధాని అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని, వారి మాటలు నమ్మితే ఈసారి ఏపీని ఎవ్వరూ కాపాడలేరని చంద్రబాబు అన్నారు. వైసీపీలోని కొందరు నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దందాలు, భూ కబ్జాలు చేస్తున్నారని, ఆ పార్టీ పెద్దల అండతోనే వారు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ‘అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేస్తే వాటిని కూడా మూసేయిస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని, మన నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తిగా ప్రతీ ఒక్కరూ బొబ్బిలి పులిలా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోకవర్గ ఇన్చార్జి ఆర్వీఎస్ఎస్ రంగారావు (బేబీనాయన), మాజీ మంత్రులు సుజయ్కృష్ణ రంగారావు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ