టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ కన్నీరు పెట్టుకున్నారు.
“నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత అవమానాన్ని భరించలేదు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా అన్ని విధాలా అవమానించడం, పార్టీ నాయకులను వేధించడంతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు, అన్నింటిని భరించాం. కుప్పం ఓటమి తరువాత మీ నాయకుడిని చూడాలనుందని వ్యాఖ్యలు చేసిన భరించాం. అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే చివరికి ఈ రోజు నా భార్యను కూడా కించపరిచేలా మాట్లాడి, రాజకీయాల్లోకి లాగుతున్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, 38 సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నాను. అనేక మంది నాయకులతో పనిచేసి, గౌరవంగానే వ్యవహరించాం. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశాం. రాజకీయాలంటే ప్రజల కోసం చేసేదని ఫీలయ్యా. కియా, పోలవరం పట్ల గర్వపడ్డాం. ఇంటర్నేషనల్ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి పనిచేశాం. నా భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు, కానీ ఈ రోజు ఘటనలను ఏ విధంగా అభివర్ణించాలో అర్ధం కాలేదు” అంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ