ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్మున్న నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన రంగ తనయుడే రాధాకృష్ణ. త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరుపున బరిలోకి దిగేందుకు రాధా సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి భారీగా ఆఫర్లు వచ్చినప్పటికీ.. తిరిగి పార్టీలో చేరాలని అధినేత జగన్ కోరినప్పటికీ రాధా మాత్రం అటు వైపు చూడలేదు. తెలుగు దేశం పార్టీపై నమ్మకంతో ఆ పార్టీలోనే ఉండిపోయారు. అయితే ఇటీవల తమ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వంగవీటి రాధాను పక్కకు పెట్టేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమ పేరును ప్రకటించారు. ప్రస్తుతం వంగవీటి రాధాను పక్కకు పెట్టేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2004లో రాధాకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాధా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కేవలం 750 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఆ తర్వాత రాధాకృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున వియవాడ తూర్పు నుంచి రాధా పోటీ చేశారు. కానీ ఈసారి కూడా ఓడిపోయారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రాధా వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారు. కానీ అప్పుడు విజయవాడ తూర్పు లేదా అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని రాధాకు జగన్ సూచించారు. కానీ రాధా విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలనే పట్టుపట్టడంతో జగన్ ఆయన్ను సైడ్ చేసేశారు. దీంతో రాధా తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ కూడా అప్పటికే ఆ టికెట్ వేరే వారికి ఇవ్వడంతో పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి కట్టబెడుతామని రాధాకు హామీ ఇచ్చింది. దీంతో ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలయింది. దీంతో ఆయనకు పదవీ దక్కలేదు.
ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ టీడీపీ హైకమాండ్ ఆ టికెట్ను ఉమాకు కేటాయించింది. దీంతో రాధాకృష్ణ దారెటు అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటేనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒంటికాలిపై లేస్తుంటారు. వారిద్దరూ రాధాకు అత్యంత సన్నిహితులు. అంతేకాకుండా పలుమార్లు వారు వైసీపీలోకి రావాలని రాధాను కోరారు. ఈకారణంగా చంద్రబాబు.. వంగవీటి రాధాకృష్ణను సైడ్ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు రాధా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY