టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. అలనాటి తార, సీనియర్ నటి జమున కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో అభిమానుల సందర్శనార్ధం ఈ ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. కాగా జమున భర్త కొన్ని సంవత్సరాల క్రితమే మరణించగా.. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించిన జమున.. అలనాటి ప్రముఖ నటుడు జగ్గయ్య ప్రోత్సాహంతో జమున సినీరంగంలోకి అడుగుపెట్టారు. తన 16వ ఏట 1952లో ‘పుట్టిల్లు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ క్రమంలో తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి తెలుగు అగ్రనటులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.
తెలుగులో మిస్సమ్మ, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మ కథతో పాటు పలు హిట్ చిత్రాల్లో నటించారు. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్గా నిలవగా.. అన్నింటిలోకి సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలో సత్యభామ పాత్రలో ఆమె దిగ్గజ నటుడు ఎన్టీఆర్తో పోటీ పడి నటించి అభిమానులను అలరించారు. కాగా జమున తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఇక అవార్డుల విషయానికి వస్తే 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందించారు. నటిగానే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రవేశించిన ఆమె 1989లో రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా జమున విజయం సాధించారు. కాగా సీనియర్ నటి జామున మృతిపట్ల పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE