తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతించనున్నట్టు తెలిపారు.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తామని, ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు గృహస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు అనంతరం, టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు తెలిపారు. అదేవిధంగా గృహస్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా కూడా వివరాలను తెలియజేస్తామని, టికెట్లు పొందిన గృహస్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాగా కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చని అన్నారు.
పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు:
ఇక పండుగ రోజుల్లో పలు ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయని తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను రద్దు చేస్తునట్టు టీటీడీ ప్రకటించింది. అదేవిధంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు తమ ఆరోగ్యం, అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ