కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న గడ్కరీకి ఏపీ రవాణాశాఖ మంత్రి రామలింగేశ్వర రావు, ఎంపీలు భరత్ రామ్, పిల్లి సుభాష్చంద్ర బోస్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితర నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి రాష్ట్రంలో రు.2,850 కోట్లుతో నిర్మించనున్న మొత్తం 8 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో ఐదు ఫ్లైఓవర్లు ఉండగా కాగా వీటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. వీటిని ప్రారంభించిన అనంతరం రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రహదారులపై కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, దీనిని అరికట్టడానికి రహదారులకు ఇరువైపులా భారీగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డీజిల్, పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా చక్కెర ద్రావకం నుంచి బయో ఇంధనాన్ని తయారుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. అలాగే మొలాసిస్, నూకల నుంచి బయోఇథనాల్ తయారు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఇది ఇలాగే కొనసాగితే స్వచ్ఛమైన గాలి దొరకదని, బయో ఇథనాల్తో నడిచే వాహనాలను అందరూ ఉపయోగిస్తే కాలుష్యాన్ని పారద్రోలే అవకాశం ఉంటుందని గడ్కరీ వెల్లడించారు.
ఇక కార్యక్రమం అనంతరం గడ్కరీ రాజమహేంద్రవరం సమీపంలోని నర్సరీలకు ప్రసిద్ధి చెందిన కడియపులంక గ్రామం సందర్శించారు. ఈ క్రమంలో ఆయనకు గ్రామంలోని సత్యదేవ్ నర్సరీ వినూత్న స్వాగతం పలికింది. ఫ్లెక్సీలతో పాటుగా గడ్కరీ చిత్రాన్ని కూడా మొత్తం పూలతోనే రూపొందించారు. వివిధ రకాల రంగు రంగుల పూలతో సత్యదేవ్ నర్సరీ యాజమాన్యం గడ్కరీ బొమ్మను తీర్చిదిద్దింది. ఇది కేంద్రమంత్రిని విశేషంగా ఆకర్షించింది. కాగా కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్రాలలో జరిగే వేడుకలకు, రాజకీయ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున బొకేలు, పువ్వులు, మొక్కలు వంటివి ఇక్కడినుంచి దిగుమతి చేసుకుంటుంటారు.
కేంద్రమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
- వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం ఎన్హెచ్-516ఎఫ్ లేనింగ్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 40.621 కిమీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.1345 కోట్లు.
- సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ ఎన్హెచ్-516ఎఫ్ 4-లేన్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 12.25 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.710 కోట్లు.
- రంపచోడవరం-కొయ్యూరు ఎన్హెచ్-516ఈ 2-లేన్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 70.12 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.570 కోట్లు.
- కైకరం ఎన్హెచ్-216ఏ వద్ద 4-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 1.795 కిమీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.70 కోట్లు.
- మోరంపూడి ఎన్హెచ్-216ఏ వద్ద 4-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 1.42 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.60 కోట్లు.
- ఉండ్రాజవరం ఎన్హెచ్-216ఏ వద్ద 4-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 1.25 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.35 కోట్లు.
- తేతాలి ఎన్హెచ్-216ఏ వద్ద 4-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 1.03 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.35 కోట్లు.
- జొన్నాడ ఎన్హెచ్-216ఏ వద్ద 4-లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన. ఈ ప్రాజెక్ట్ పొడవు 0.93 కి.మీ కాగా, ప్రాజెక్ట్ వ్యయం రూ.25 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY