ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాజాగా 2014లో లాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది.
సంక్రాంతి తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కటి కానున్నాయని, దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పొత్తు విషయాన్ని ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది.
ముగ్గురు జాతీయ నేతలకు ఏపీ పొత్తు పంచాయితీని అప్పగించారని, ఇప్పటికే ఆ నాయకులు మిగిలిన నేతల అభిప్రాయాన్ని కూడా సేకరించారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే దీని వల్ల లాభమా, నష్టామా అనేది కూడా లెక్కలు వేశారని, ఆ నివేదికను ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్ వద్దకు చేరిందని కూడా తెలుస్తోంది.
త్వరలోనే పార్లమెంటరీ బోర్డులోనూ.. మూడు పార్టీల పొత్తులపై సుదీర్ఘంగా చర్చించి బీజేపీ అధిష్టానం తుది నిర్ణయానికి రానుందట. అయితే పొత్తులో భాగంగా బీజేపీ తమకు 12 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలను కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి టీడీపీ, జనసేన ఓకే అంటే టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు ఖరారయినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి జనవరి మొదటి వారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ఒప్పించి.. వైసీపీకి చెక్ పెట్టడానికి వారిని ఒప్పించడానికి పవన్ పట్టుదలతో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఈ మూడు పార్టీల పొత్తుపై సంక్రాంతికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లే జరిగితే 2014 రాజకీయం ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాబోతుందని…కాకపోతే అప్పుడు చేసిన తప్పులు చేయకుండా స్ట్రాటజీతో ఈ మూడు పార్టీలు ముందుకెళ్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ