తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలి వద్ద వైవీ సుబ్బారెడ్డి చేత టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్రెడ్డి, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముందుగా జూన్ 21, 2019న టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆయన నేతృత్వంలోని టీటీడీ పాలకమండలి పదవీకాలం జూన్ 21, 2021తో పూర్తయింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీటీడీలో ఇతర సభ్యులను త్వరలో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ