తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అలనాటి ప్రముఖ నటుడు బాలయ్య కన్నుమూశారు. 94 సంవత్సరాల బాలయ్య హైదరాబాద్ యూసఫ్గూడలోని తన స్వగృహంలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా చావపాడులో ఏప్రిల్ 9, 1930వ సంవత్సరంలో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు బాలయ్య. 1952లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్లలో లెక్చరర్గా పనిచేశారు. బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామ రాజు, పెద్దరికం, గాయం, యమలీల, పెళ్లిసందడి, అన్నమయ్య, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం సినిమాల్లో బాలయ్య తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన గాత్రానికి సినిమా పెద్దలు సైతం అచ్చెరువొందేవారట. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలం నుంచి నటిస్తున్న బాలయ్య ఇప్పటివరకు 300 పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు అగ్ర నటులు ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ సమకాలీకుడైన బాలయ్య ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడుగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. బాలయ్య నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం(హీరో – శోభన్ బాబు), నేరము-శిక్ష (హీరో – కృష్ణ) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (హీరో – చిరంజీవి) వంటి చిత్రాలు నిర్మించారు. అలాగే.. పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, ‘చెల్లెలి కాపురం’ చిత్రానికి నిర్మాతగా ‘నంది అవార్డులను సైతం గెలుచుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా ఒక సమయంలో కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. కాగా బాలయ్య మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే బాలయ్య జన్మదినం కూడా ఈరోజే కావటం, జన్మదినం రోజునే ఆయన మరణించడం విషాదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ