కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా చివరి రోజు ఆటలో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ గేమ్స్లో బ్యాడ్మింటన్లో భారత్కు రెండో స్వర్ణ పతకం దక్కింది. భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో లక్ష్యసేన్ 19-21, 21-9, 21-16తో మలేషియా ఆటగాడు ఎంజీ జీ యోంగ్ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్ లో సేన్ 21-19తో గేమ్ను కోల్పోయాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సేన్ 21-9తో రెండో గేమ్ను గెలుచుకున్నాడు. ఇక విజేతను నిర్ణయించే చివరి సెట్ లో 21-16తో గేమ్ను ముగించి భారత్కు బంగారు పతకాన్ని ఖాయం చేశాడు. కాగా దీనికి ముందు భారత మరో స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించగా, అందులో 20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి. లక్ష్య సేన్ బంగారు పతక ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY