మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు తీరును సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇక ఈ అంశాన్ని అత్యవసర జాబితా కింద విచారించేందుకు ఉదయం 10.30 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించగా, మంగళవారం మధ్యాహ్నం 3.50 గంటలకు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. కాగా రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి ఆరోపణలకు సంబంధించి మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు, విచారణ కోసం సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఇక సిసోడియాను సిబిఐ రిమాండ్కు పంపుతున్న సందర్భంగా రోస్ అవెన్యూ కోర్టు, రిమాండ్ కాలంలో సిసోడియాను సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీటీవీ కవరేజీ ఉన్న చోట ఏదో ఒక ప్రదేశంలో విచారించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కేసులో వాస్తవాలు మరియు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సిసోడియాను విచారణ కోసం మార్చి 4 వరకు ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. కాగా ఇదే కేసుకి సంబంధించి మరికొందరు ముఖ్యులను త్వరలోనే అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో సీబీఐ తదుపరి టార్గెట్ ఎవరు ఉంటారోనని ఢిల్లీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE