ఇరాక్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా సైనిక వర్గాలు ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలోనే ఇరాన్ ఈ ప్రతీకారదాడులకు దిగినట్టుగా తెలుస్తుంది. ఇరాక్లోని ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై ఇరాన్ తన క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. దీనిపై అమెరికా రక్షణ విభాగం స్పందిస్తూ , ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి పరిస్థితులను ట్రంప్ స్వయంగా సమీక్ష చేస్తున్నారని, అనంతరం సరైన సమయంలో బదులిస్తామని ప్రకటించింది. ఈ దాడుల వలన అమెరికా – ఇరాన్ దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇరాన్ చేసిన క్షిపణి దాడుల్లో 80 మందికిపైగా అమెరికా సైనికులు మృతిచెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అమెరికాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్లు, ఇతర సామాగ్రి తీవ్రంగా ధ్వంసమైనట్లు మీడియా కథనాల్లో పేర్కొన్నారు. అలాగే ఇరాక్ పౌరులెవరూ చనిపోలేదని వెల్లడించారు.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -