ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోసం ఆయన శుక్రవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిళ్లై పిటిషన్పై స్పందించాలంటూ ఈడీకి రోస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. కాగా ఇదివరకు, రామచంద్ర పిళ్లై.. తాను తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కోసం పనిచేశానని కూడా ఆయన వెల్లడించారు. దీంతో పిళ్ళై ఇచ్చిన వాంగ్మూలాన్ని రిమాండ్ రిపోర్టులో చేర్చి ఈడీ అతడిని అరెస్ట్ చేసింది.
కాగా ఈ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగానే రేపు (శనివారం, మార్చి 11, 2023) కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. అయితే తొలుత ఈనెల 9వ తేదీనే కవితను విచారించాల్సి ఉండగా.. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల షెడ్యూల్ కారణంగా ఆరోజున విచారణకు హాజరు కాలేనని, 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్న కారణంగా, 11న విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత ఈడీకి తెలిపారు. దీనికి సమ్మతించిన ఈడీ అధికారులు రేపు విచారణకు రావాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో నేడు రామచంద్ర పిళ్లై కోర్టుకు వెళ్లి తన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. దీంతో రేపటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE