భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 53ను ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను వాటి పరిభ్రమణ కక్ష్య లోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. అయితే ఈ ఉపగ్రహాలు అన్నీ సింగపూర్కు చెందినవని ఇస్రో అధికారులు తెలిపారు. కాగా ఇస్రోకు ఇది ఈ సంవత్సరంలో రెండవ పీఎస్ఎల్వీ మిషన్ కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇస్రో భూమి పరిశీలన కోసం తయారు చేసిన ప్రత్యేక ఉపగ్రహం ఈఓయస్-04, మరియు మరో రెండు చిన్న ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ-సీ 52ను ప్రయోగించింది.
ఇక ఇస్రో తన సొంత ప్రయోగాలే కాకుండా వాణిజ్య పరంగా కూడా ఇతరదేశాల ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది. ఇలా ఇప్పటివరకు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2016లో పీఎస్ఎల్వీ సీ37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి ప్రపంచ దేశాలను విస్మయపరిచారు. ఇక గ్రావిటీ పరంగా శ్రీహరికోట ఇస్రోకు కలిసొచ్చే అంశం. మిగిలిన దేశాలకన్నా ఇక్కడ భూమ్యాకర్షణ శక్తి తక్కువ కావడం మూలాన అనేక దేశాలు తమ భారీ రాకెట్లను ఇక్కడినుంచే ప్రయోగించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంకా వాణిజ్యపరంగా కూడా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సింగపూర్ దేశానికీ చెందిన 3 శాటిలైట్స్ను ప్రయోగించడం జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ