మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పూటకో మలుపు తిరుగుతోంది. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేసి రాష్ట్ర రాజకీయాలను గందరగోళంలోకి నెత్తిన ఏక్నాథ్ షిండేకు షాక్ ఇచ్చే ఉద్దేశంతో శివసేన ఆఖరి ప్రయత్నంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది. ఈ మేరకు ఏక్నాథ్ షిండే సహా 11 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు అందజేసింది. అయితే ఏక్నాథ్ షిండే ఇలాంటివాటికి భయపడేది లేదని వ్యాఖ్యానించారు. తనకు మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీరిలో శివసేన పార్టీ సభ్యులే 40 మంది వరకు తనకు మద్దతునిస్తున్నారని స్పష్టం చేశారు. వీరితో పాటు స్వతంత్రులు మరో 10 మంది తన పక్షాన ఉన్నారని హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే 35 మంది శివసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు ఏక్నాథ్ షిండే సమర్పించారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో కలిసి దిగిన ఫొటోలను, వీడియోను మీడియాకు విడుదల చేశారు. దీంతో షిండే నాయకత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేలు జై కొడుతున్న నేపథ్యంలో.. మహా వికాస్ అఘాడీ (ఎంవీయే) కూటమి నుంచి వైదొలగడానికి శివసేన సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తిరుగుబాటు నేతలను రాష్ట్రానికి రావాలంటూ పిలుపునిచ్చారు. వారంతా 24 గంటల్లోగా ముంబైకి తిరిగి వచ్చేస్తే ఎంవీయే కూటమి నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామని, వారి డిమాండ్లపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించడానికి సిద్ధమని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు షిండే వర్గం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY