ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పోరాడే వారికే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృత సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. నాయకులందరూ ఐక్యతగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ పార్టీ నాయకులను హెచ్చరించారు. కొందరు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని, పార్టీలో అంతర్గతంగా ఏవైనా సమస్యలుంటే మీడియా ముందుకు రాకూడదని, సంస్థాగతంగా ఏర్పాటైన కమిటీల వద్ద తెలియజేయాలని సూచించారు. రానున్న ఎన్నికలలో ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.
అలాగే హైదరాబాద్ లో కూర్చోవటం కాదని, వారి వారి నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడాలని రాహుల్ గాంధీ కోరారు. పనిచేయకపోతే పార్టీలో ఎంతటి సీనియర్ నేతలకైనా వచ్చే ఎన్నికలలో టికెట్ రాదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ప్రత్యక్ష పోరు ఉంటుందని పునరుద్ఘాటించిన రాహుల్, ప్రతిభ ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగుల కోసం పోరాడి ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వారికి మెరిట్ ప్రాతిపదికన టిక్కెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. పార్టీలో తనపై వివక్ష చూపుతున్నారని ఎవరూ భావించవద్దు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అలాగే నిన్నటి బహిరంగ సభలో వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ నేతలకు తొలి మైలురాయి అని పేర్కొంటూ.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి, ప్రతి రైతుకు వరంగల్ డిక్లరేషన్ గురించి చెప్పడమే తమ ముందున్న మొదటి కర్తవ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ