త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి విజయం దిశగా వెళ్తుంది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేయగా, ఐపీఎఫ్టీకి ఆరు చోట్ల పోటీ చేయగా, వరుసగా రెండోసారి కూడా త్రిపుర ప్రజలు బీజేపీ పాలనకే పట్టంకట్టారు. గత ఐదు సంవత్సరాల్లో త్రిపురలో బీజేపీ నేత బిప్లబ్ కుమార్ దేబ్ నాలుగేళ్లు సీఎంగా ఉండగా, బీజేపీ అధిష్టానం ఏడాది క్రితమే మాణిక్ సాహాను సీఎం చేసింది. మాణిక్ సాహా నేతృత్వంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఈసారి త్రిపుర ఎన్నికలను వామపక్షాలు-కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన కూడా బీజేపీ ముందు నిలువలేకపోయింది. అయితే మాణిక్య రాజవంశానికి చెందిన ప్రత్యోద్ సారథ్యంలోని రీజినల్ పార్టీ టిప్రా మోతా మాత్రం సత్తా చాటి పలు స్థానాలను దక్కించుకుంది.
త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 31 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ కూటమి 33 (22 గెలుపు+ 10 ఆధిక్యం) స్థానాల్లో సత్తా చాటింది. స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. కాగా వామపక్షాలు-కాంగ్రెస్ కూటమి 14 (8 గెలుపు+ 6 ఆధిక్యం) స్థానాలు దక్కించుకోనుంది. టిప్రా మోతా పార్టీ 12 స్థానాలు దక్కించుకోగా, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
అలాగే త్రిపుర సీఎం మాణిక్ సాహా విజయం సాధించారు. టౌన్ బొర్ధోవలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మాణిక్ సాహా, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశిష్ కుమార్ పై 1,180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు త్రిపుర తదుపరి సీఎంగా బీజేపీ అధిష్టానం మాణిక్ సాహాకే అవకాశమిస్తుందా?, మరొకరిని ఎంచుకుంటుందా అనేది వేచి చూడాలి.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (60): (గెలుపు+ఆధిక్యం):
- బీజేపీ: 32
- సీపీఎం: 11
- కాంగ్రెస్ : 3
- ఐపీఎఫ్టీ: 1
- టిప్రా మోతా: 13.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE