ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మెడికల్ గ్రౌండ్స్ నివేదిక ఆధారంగా శుక్రవారం ఆయనకు 6 వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. జూలై 11వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుందని, ఆ సమయంలో సత్యేందర్ జైన్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇక బెయిల్ తీసుకున్న సమయంలో సత్యేందర్ జైన్ మీడియాతో మాట్లాడరాదని, అలాగే ఢిల్లీ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. కాగా జైన్ ప్రస్తుతం ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గురువారం జైన్ తీహార్ జైలులోని బాత్రూమ్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా అందుకు కోర్టు సమ్మతించింది. అయితే జైన్ను వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం వారంలో ఇది రెండోసారి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఆయన వెన్నెముకకు గాయం కారణంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత ఏడాది మేలో ఒక మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినప్పటి నుండి ఆయన తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సత్యేందర్ జైన్ షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారని, అక్రమ నిధులతో భూములు కొనుగోలు చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE