దేశంలో గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ముఖ్య నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా పాల్గొన్నారు. ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదల, దేశంలో కోవిడ్ స్థితిపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. రోజువారీ కోవిడ్-19 కేసుల పెరుగుదల, పాజిటివిటీ రేటు, మరణాలు, టెస్టింగ్ స్టేటస్, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల శాతం, జీనోమ్ సీక్వెన్సింగ్, కోవిడ్-19 వ్యాక్సినేషన్ వివరాలను తెలియజేశారు.
అనంతరం కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, అధిక కేసుల పాజిటివిటీని నివేదించే జిల్లాలపై దృష్టి సారించాలని, టెస్టింగ్ను వేగవంతం చేస్తూ, అక్కడ తగినన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అధికారులు కోవిడ్ నిఘాపై దృష్టి సారించి, ఏదైనా సాధ్యమయ్యే మ్యుటేషన్ కోసం స్కాన్ చేయడానికి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ (డబ్ల్యూజీఎస్) పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే కోవిడ్-19 కేసుల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిని పర్యవేక్షించాలని చెప్పారు. మరోవైపు కేసులు ఎక్కువుగా నమోదవుతున్న జిల్లాల్లో బూస్టర్ డోస్లతో సహా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని సూచించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు తగినన్ని అందుబాటులో ఉన్నందున అర్హులైన మరియు ప్రభావిత వర్గాల్లో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడంపై దృష్టి సారించి, వ్యాక్సిన్ వృధా కాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF