అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత 24 గంటల్లోనే అమెరికాలో దాదాపు 2 వేల కరోనా మరణాలు సంభవించాయి. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 12,878 కి చేరుకుంది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉండగా, ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటిదాకా కేవలం 22,020 మంది మాత్రమే కోలుకున్నారు.
ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలో 1,38,000 కరోనా కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన ఇప్పటి వరకు 5,400 మంది మృతిచెందారు. అలాగే న్యూజెర్సీలో 44,416 మందికి వైరస్ సోకగా, 1,200 మంది మృత్యువాతపడ్డారు. తాజా పరిసితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, వైరస్ కట్టడికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపడతుందని చెప్పారు. పరిస్థితులు గతంతో పోల్చుకుంటే కొంత మెరుగుపడ్డాయని, ఊహించినంతగా విషమంగా లేవని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం అంచనా వేసిన విధంగా పెద్ద స్థాయిలో మరణాలు ఉండకపోవచ్చునని ట్రంప్ వెల్లడించారు.
మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అమెరికా నుంచి ఇచ్చే నిధుల్ని నిలిపివేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేగాక డబ్ల్యూహెచ్ఓ సంస్థపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్ల్యూహెచ్ఓ పూర్తిగా చైనా అనుకూల వైఖరి అవలంభిస్తుందని ఆయన ఆరోపించారు. ముందుగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన మొదటిరోజుల్లో అందుకు సంబంధిన పూర్తీ సమాచారం ఆ సంస్థ వద్ద ఉన్నా కూడా అమెరికాతో పంచుకోవడానికి ఇష్టపడలేదని ట్రంప్ పేర్కొన్నారు.