ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆరోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకొని, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ కన్యానగర్ క్షేత్ర ప్రాథమిక పాఠశాలలో, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ ఖుషీనగర్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆరో దశలో భాగంగా అంబేద్కర్నగర్, బల్రాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహరాజ్గంజ్, గోరఖ్పూర్, ఖుషీనగర్, డియోరియా మరియు బల్లియా వంటి 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం నాడు పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఈ దశలో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోరఖ్పూర్ అర్బన్ నుండి సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ తమ్కుహి రాజ్ స్థానం నుండి, సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్నగర్ నుండి పోటీలో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఆప్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక మార్చి 7న ఏడో దశతో ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. మార్చి 10న ఓట్లలెక్కింపు పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ