ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జగదీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలన్ని కాంగ్రెసేతర ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించనున్నట్టు తెలుస్తుంది. తమ ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడానికి వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు రేపు (జూలై 17, ఆదివారం) ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, జూలై 19తో ముగియనుంది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY