ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నేడు (మార్చి 25, శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు లక్నోలోని అటల్ బిహారి వాజ్ పేయి ఎకానా స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యోగితో పాటు 50 మందికిపైగా నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, పలు ఇతర పార్టీల కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. అలాగే వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరుకానుండడంతో ఇప్పటికే స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు.
ముందుగా యూపీలో 37 ఏళ్ల తరువాత అధికారం నిలబెట్టుకుని, వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు. 1985 లో ఎన్డీ తివారీ తర్వాత ఇప్పటివరకు మరెవరూ వెంటనే రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానంలో 1,03,390 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లి ప్రమాణ స్వీకారం తేదీ, కేబినెట్ కూర్పు, ప్రముఖులకు ఆహ్వానం తదితర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించారు. గురువారం నాడు ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ శాసనసభా పక్ష పార్టీ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం గవర్నర్ ఆనంది బెన్ పటేల్ యోగి ఆదిత్యనాథ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ