పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో 127మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆధార్ సంస్థకు (ఉడాయ్) లేదని విమర్శలు వస్తుండడంతో ఈ అంశంపై ఉడాయ్ వివరణ ఇచ్చింది. తప్పుడు పత్రాలతో కొందరు ఆధార్ కార్డులు పొందారనే నేపథ్యంలోనే 127 మందికి నోటీసులు పంపినట్లు ఫిబ్రవరి 19, మంగళవారం నాడు ఉడాయ్ ప్రకటించింది. అలాగే ఈ నోటీసులకు పౌరసత్వ సవరణ చట్టంతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. నోటీసులు అందుకున్న వ్యక్తులు అన్ని ఒరిజనల్ పత్రాలతో ఫిబ్రవరి 20లోగా విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలిపారు. ఒకవేళ విచారణ సమయంలో సరైన పత్రాలు సమర్పించకపోతే ఆధార్ రద్దు చేస్తామని తెలియజేశారు.
ఆధార్ వెరిఫికేషన్లో భాగంగా కొందరి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం సాధారణమేనని తెలిపారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ తెలంగాణ పోలీసుల నుండి నివేదికల వచ్చిన తరువాతనే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఉడాయ్ తెలిపింది. అక్రమ వలసదారులకు ఆధార్ జారీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో ఉడాయ్ ను ఆదేశించినట్టు తెలిపారు. కొన్నిసార్లు ఎవరైనా తప్పుడు బయోమెట్రిక్స్ లేదా పత్రాలను సమర్పించడం ద్వారా ఆధార్ పొందాడని గుర్తించినప్పుడు ఆధార్ నెంబర్ ను రద్దు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బయట కొన్ని చోట్ల ప్రచారం జరుగుతున్న విధంగా ఈ నోటీసులకు పౌరసత్వ సవరణ చట్టానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
[subscribe]