ఖమ్మంలో జనవరి 18వ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామానాగేశ్వర్రావు, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్రెడ్డి, హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమల్రాజ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. అలాగే సభ సంబంధిత అంశాలతో పాటుగా జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్ పార్టీ నేత, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటుగా మరికొందరు కీలక జాతీయ నేతలు హాజరకానుండడంతో సభను భారీ స్థాయిలో నిర్వహించాలని పార్టీ ప్రణాళిక రూపొందించింది. తొలిసారిగా బీఆర్ఎస్ సభ జరుగుతుండడం, పలువురు జాతీయ నాయకులు హాజరు కానుండడంతో అందరి చూపు ఖమ్మం బహిరంగ సభపై ఉంటుందని, సభ నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
విశాలమైన ప్రాంగణంలో బహిరంగ సభ వేదిక ఏర్పాటు చేయాలని, హాజరయ్యే వారికీ అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ బాధ్యతను మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి, ఏపీ ఇతర ప్రాంతాలనుంచి 5 లక్షల మందికి పైగా జనసమీకరణ చేయనున్నట్టు తెలుస్తుంది. జిల్లా పార్టీ నేతలు విభేదాలు లేకుండా సభను భారీ స్థాయిలో విజయవంతం చేసేలా సమన్వయంతో పనిచేయాలని నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇంతటి చారిత్రక సభను ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినందుకు జిల్లా నేతలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఖమ్మం సభ వేదికనుంచే బీఆర్ఎస్ యొక్క జాతీయ రాజకీయాల అజెండాను, బీఆర్ఎస్ శాఖల ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE