తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ రిలీవ్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, జనవరి 12వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిపోర్ట్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సోమేశ్ కుమార్ కొనసాగేందుకు క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను ఈ రోజు (జనవరి 10, మంగళవారం) తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయనను వెంటనే రిలీవ్ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడంతో ఆ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. అయితే కేంద్రం నిర్ణయంపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించగా, క్యాట్ కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసి తెలంగాణలోనే కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం క్యాట్ ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. దీంతో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కోరుతూ 2017వ సంవత్సరంలో కేంద్రం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై విచారణ జరగగా, ఈ రోజు తెలంగాణ హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు వెల్లడించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేడర్ కేటాయింపుని రద్దు చేయడంతో పాటు ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2019, డిసెంబర్ నుంచి తెలంగాణ సీఎస్గా సోమేశ్ కుమార్ కొనసాగుతుండగా, 2023 డిసెంబర్ లో సర్వీస్ నుంచి పదవీ విరమణ చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE