తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మరియు బీజేపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్ నుంచి పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్నే ముఖ్యమంత్రిని చేయాలన్న ఆకాంక్షను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నిక ప్రతిబించిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ నేతలు దేవుడు అంటున్నారని, ఆయన ఎవరికి దేవుడు? మీ బీజేపీ కా? గుజరాత్ కా? అని మంత్రి ప్రశ్నించారు. వేములవాడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీని దేవుడనటం తెలంగాణ బీజేపీ నేతలకే చెల్లిందని వ్యాఖ్యానించారు.
పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి, రకరకాల నల్లచట్టాలు తెచ్చి సామాన్యులను బాధిస్తున్న వారు దేవుడిలా అవుతారు? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక గత కొన్ని రోజులుగా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ కొనసాగుతుందని, రాష్ట్రాల మధ్య గొడవనే పరిష్కరించలేని మోదీ రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆపారని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి పాలించిన 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసినంత అప్పు.. ఈ ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ ఒక్కరే చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE