ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ ఎంపీలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు ముందుగానే ప్రత్యేక యాగశాల, హోమ గుండాలు సహా పూజా కార్యక్రమాలు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. ఈ యాగ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. మంగళవారం పుణ్యహవాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనుండగా, బుధవారం నాడు నవ చండీహోమం, రాజశ్యామల హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిసెంబర్ 14 నుంచే బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE