తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వనపర్తి జెడ్పీహెఛ్ఎస్ బాయ్స్ హైస్కూల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి మన ఊరు-మన బడి పైలాన్ ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. మొదటి దశలో 9,123 ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్ల బడ్జెట్ తో పనులు చేపట్టనున్నారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అనంతరం నాగవరంలో వనపర్తి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆతర్వాత వనపర్తి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక మధ్యాహ్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ