గ్రేటర్ హైదరాబాద్ లో నాలా పూడికతీత పనులు, నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత ముమ్మరంగా చేసేందుకుగాను ప్రతీ జోన్ కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజనీర్ ను పర్యవేక్షక అధికారిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నగరంలో శానిటేషన్, రహదారుల అభివృద్ధి, నాలా విస్తరణ కార్యక్రమాలపై నిర్వహించిన ఈ సమావేశానికి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఉప మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ , జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దాదాపు నాలుగు గంటలు సాగిన ఈ సమావేశంలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ, సాద్యమైనంత అదనపు యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించి పూడిక పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూడిక తీత పనులు అత్యంత ప్రాధాన్యతగల పనుల్లో చేరుస్తూ వీటి పనులకుగాను నిధులను విడుదల చేసేందుకై ప్రత్యేకంగా గ్రీన్ చానెల్ ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా, నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాలలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వెంటనే కేటాయించాలని ఆదేశించారు. నాలా విస్తరణ, అడ్డంకుల తొలగింపు పనులను సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో స్వల్పకాలిక పనులను పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణకై రూ. 2800 కోట్ల విలువైన టీ.డీ.ఆర్ లను అందచేయడం దేశంలో మరే నగరంలో జరగలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై కమీషనర్ లోకేష్ కుమార్, ఛీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి లను మంత్రి కేటీఆర్ అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకన్నాముందంజలో ఉందని, దీనిలో భాగంగా ఎస్.ఆర్.డి.పి కార్యక్రమంలో చేపట్టిన దాదాపు 21 ప్రాజెక్టులు నగర వాసులకు అందుబాటులో వచ్చాయని, మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తికానున్నాయని వెల్లడించారు. నగరంలోని చెరువులను సుందర తటాకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హైదారాబాద్ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను మంత్రి కోరారు.
నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపించాలని, ఈ విషయంలో జోనల్ కమీషనర్లు ప్రతీ రోజూ ఉదయం వేళలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శానిటేషన్ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ప్రతీ సర్కిల్ లో ఎన్ని నివాసాలున్నాయి, శానిటేషన్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి, అదనంగా ఎన్ని కావాలి తదితర అంశాలపై ఈ ఆడిట్ నిర్వహించాలని కోరారు. గతంలో ఉన్న పరిచయం, సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగర పౌరుల సదుపాయాలకై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ