తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు మంత్రులతో సమావేశమవనున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఫ్లోర్ లీడర్లు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలపై కీలక చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మైనర్ బాలిక ఘటనలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల పిల్లలకు సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలపై, ప్రతిపక్షాల విమర్శలు నేపథ్యంలో ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అలాగే రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక గురించి కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్, కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రధాన నేతలతో భేటీ అవుతుండటం తెలిసిన విషయమే. రాష్ట్రపతి ఎన్నికలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF