తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (జనవరి 18, బుధవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే ఖమ్మంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం అంధత్వరహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం ఖమ్మం కలెక్టరేట్ వేదికగా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా హాజరు కానున్నారు.
ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులో కొంతమంది ప్రజలకు పరీక్షల నిర్వహణ అనంతరం జాతీయ నేతలతో కలిసి వారికీ సీఎం కేసీఆర్ కంటి అద్దాలు అందజేయనున్నారు. ఇక రేపటి (జనవరి 19) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు/క్యాంపులు నిర్వహించి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్, జాతీయ నేతలతో కలిసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ తోలి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE