ఉక్రెయిన్ లో ఏర్పడ్డ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న వేలాది మంది భారత్ విద్యార్థులు చదువులు మధ్యంతరంగా వదిలేసి తిరిగి దేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంపై మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లేఖ రాశారు.
“ఉక్రెయిన్లో అకస్మాత్తుగా యుద్ధం జరుగుతుండడంతో ఉక్రెయిన్లోని వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు వివిధ దశల్లో తమ చదువుకు అంతరాయం కలిగించి, తీవ్ర ఇబ్బందులతో భారతదేశానికి తిరిగి రావలసి వచ్చింది. ఈ విషయం మీకు తెలిసిందే. ఉక్రెయిన్లో తమ వైద్య విద్యను అభ్యసించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించి, పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చుపెట్టిన ఈ భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ప్రస్తుత పరిస్థితులు ప్రమాదంలో పడేశాయి. వారి విద్యాభ్యాసం ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి స్థానభ్రంశం చెందిన 20,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో తమ పిల్లల వైద్య విద్యను పూర్తి చేయకపోతే, వారు తమ జీవితకాల సేవింగ్స్ కోల్పోతారు. వారి భవిష్యత్తును కాపాడటానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయాలని మీరు అంగీకరిస్తారని భావిస్తున్నాను” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
“ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వారి విద్యను పూర్తి చేయడంలో వారికి సహాయపడటానికి వారు దేశంలోని వైద్య కళాశాలల్లో సమానమైన సెమిస్టర్లలో చేరేలా వీలు కల్పించండి. ప్రస్తుతం వాడుకలో ఉన్న నిబంధనలను సడలించడం ద్వారా వారిని దేశంలోని వైద్య కళాశాలల్లో చదువుకునేందుకు అనుమతించాలని నేను ఈ ప్రత్యేక సందర్భంలో అభ్యర్థిస్తున్నాను. ఈ విద్యార్థులకు అవకాశం కల్పించడానికి వైద్య కళాశాలల్లోని వివిధ సెమిస్టర్లలోని సీట్లను దామాషా ప్రకారం ‘వన్టైమ్’ ప్రాతిపదికన పెంచడానికి అనుమతి ఇవ్వండి. వైద్య విద్యను పూర్తి చేయకుండా ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన 700 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు చెందిన విద్యార్థుల మెడికల్ కాలేజీ ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పరిశీలించి, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ