రాష్ట్రంలో కోవిడ్ వాక్సిన్ పంపిణీలో వంద శాతం లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ పై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కోట్ల కోవిడ్ వాక్సిన్ డోసులను అందచేశామని తెలియ చేశారు. ప్రపంచంలోని పలు పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్ తదితర దేశాలతో పాటు చైనాలో కోవిడ్ వైరస్ మరో రూపంలో తిరిగి ప్రబలింది అన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వాక్సినేషన్ ను మరింత ఉధృతంగా చేపట్టేందుకై గ్రామ/వార్డు స్థాయి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రత్యేక బృందంలో ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయితీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా చేయాలని పేర్కొన్నారు. ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారిని, మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి ప్రతీ రోజూ వాక్సినేషన్ ముమ్మరంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. వాక్సిన్ డోసులు, సిరంజీలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి నుండి కాపాడేందుకు కేవలం రెండు డోసులు వాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమనే సందేశాన్ని ప్రతీ ఒక్కరిలో కల్పించి వాక్సినేషన్ ను సమర్థవంతంగా చేపట్టాలని సీఎస్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డా.సత్యనారాయణ, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్, పంచాయితీ రాజ్ కమీషనర్ డా.ఎ.శరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ దివ్య దేవరాజన్, ఆరోగ్య శాఖ సంచాలకులు డా.గడల శ్రీనివాస్ రావు, వైద్య విద్యా శాఖ సంచాలకులు డా.రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి.గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ