ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. మార్చి 11వ తేదీన కవిత తొలిసారిగా ఈడీ విచారణకు హాజరుకాగా, ఆమెను పలు అంశాలపై 8 గంటలకుపైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ముందుగా సోమవారం ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. కవిత విచారణ నేపథ్యంలో సీఎం నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడి ఆమెకు మద్దతు తెలిపారు. ఈడీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఎమ్మెల్సీ కవిత వెంట ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్గౌడ్, సీనియర్ అడ్వకేట్ సోమా భరత్ కుమార్ కూడా ఉన్నారు. మార్చి 20, సోమవారం విచారణ హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రమే ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కవితతో పాటుగా ఢిల్లీ వెళ్లిన వారిలో మంత్రి కేటీఆర్, పలువురు పార్టీ నేతలు కూడా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి మార్చి 11న విచారణ అనంతరం, మళ్లీ మార్చి 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే మార్చి 16న ఆమె విచారణకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పై మార్చి 24న విచారణ జరగనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు వేచిచూడాలని, ఈ క్రమంలోనే 16న విచారణకు తాను హాజరు కావడం లేదని ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు లేఖ ద్వారా సమాధానమిచ్చింది. అనంతరం ఈడీ స్పందిస్తూ, మార్చి 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఈ రోజు విచారణ నిమిత్తం ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్ లోని ఈడీ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE