టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో గురువారం నాడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఫ్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. శామీర్పేటలో గల మంత్రి ఈటల నివాసంలో జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈటలతో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈటలకు నైతిక మద్ధతు తెలిపేందుకే కలిశామని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తప్పుచేస్తే ఇంకా పార్టీలో ఎందుకు ఉంచుకున్నారని కొండా ప్రశ్నించారు. భూములు ఆక్రమించినట్టు ఆరోపణలు చేస్తున్నప్ప్పుడు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని అన్నారు. ఇది కోవిడ్ సమయమని, రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని అన్నారు. అలాగే కొత్త పార్టీపై తమకు తొందరేమీ లేదని, కోవిడ్, వ్యాక్సినేషన్, ప్రస్తుత పరిస్థితులు మెరుగవడంపైనే ఆలోచన చేస్తున్నామన్నారు.
ఫ్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, రాజకీయపరమైన విభేదాలు ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని అన్నారు. ఈటల రాజేందర్ పై జరిగిన దాడిని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగానే చూస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అందరం ఏకతాటిపై ఉండాలని చర్చించామని, అయితే అది ఏ రూపం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ