భాషలో యాస.. మాటల్లో పంచ్లు.. పదునైన వాక్కులు.. ప్రజల మనసు లోతుకు వెళ్లేలా సెంట్మెంట్ సూత్రాలు.. ఇవీ తెలంగాణ ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు, ఆయన తనయుడు, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఎన్నికల ప్రచారంలో అవలంభిస్తున్న పంథా. తండ్రీతనయులు ఇద్దరూ రాష్ట్రాన్ని చెరోవైపు చుట్టేస్తున్నారు. తూటాల్లాంటి మాటలతో విపక్షాల తీరును ఎండగడుతున్నారు. ఆగమయ్యే తెలంగాణ కావాలా.. బంగారమయ్యే తెలంగాణ కావాలా.. అంటూ కేసీఆర్ ప్రశ్నిస్తుంటే.. సముజ్జీలతో పోటీ.. రాజకీయ మరగుజ్జుగాళ్లతో కాదు.. అంటూ ప్రాసలతో కేటీఆర్ ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ముందట వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ్లు పెద్ద సిపాయిలట.. వీళ్లు రాష్ట్రాన్ని నడుపుతారట.. మనం చూడల్నాట అని తండ్రిని శిఖరానికి ఎత్తుతూ.. ప్రతిపక్షాలపై మండిపడుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్నారు.
ఓ పక్క ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దాదాపు ఏడు పదుల వయస్సులోనూ రోజుకు మూడు బహిరంగసభల్లో పదునైన వాగ్బాణాలతో, ప్రతిపక్షాలను తుత్తునియలు చేస్తూ ప్రజల ఆశీర్వాదం పొందుతున్నారు. మరోవైపు మునిసిపల్ మంత్రి కె. తారకరామారావు, టి.హరీష్రావులు రోజూ పదుల సంఖ్యలో పార్టీలోకి వస్తున్న వారిని దగ్గరకు తీసుకుంటూ, ప్రచారాల్లో పాల్గొంటూ , బీఆర్ఎస్కు– ఇతర పార్టీలకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ కాలంతో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్.. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సాధించిన అభివృద్ధిని అక్షరం కూడా పొల్లుపోకుండా , మాట తడడకుండా అణాకానీ లెక్కలతో సహ గణాంకాలతో వివరిస్తున్న తీరు చూసి మహామహా ఉపన్యాసకులే ఆశ్చర్యపోతున్నారు.
చేతిలో కాగితం లేకుండానే మైకు చేత పట్టుకున్నారంటే రాష్ట్ర తలసరి ఆదాయం నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో ఆయా రంగాలకు ఎంత ఖర్చుపెట్టింది.. ఎన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టింది, ఎన్ని లక్షల మందికి ఉపాధి నిచ్చిందీ, ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు వచ్చిందీ, ఎన్ని మెడికల్ కళాశాలలు వెలసిందీ చెబుతుంటే ఎక్కడిదీ మెమరీ ? అంటూ చర్చించుకుంటున్నారు. ఇక సంక్షేమ పథకాల చిట్టానూ ఆసరా నుంచి ఆరంభిస్తే షాదీముబారక్ దాకా వివరిస్తున్న తీరు అనితర సాధ్యం అనేలా ఉన్నాయి.ఇవి ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు సిద్ధమైన వారు అనుసరిస్తున్న తీరుకు అద్దం పడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. తెలంగాణ సెంటిమెంట్ను వాడవాడలా రగిలిస్తూ.. హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేస్తున్నారు. స్థానిక సమస్యలు, అవసరాలపై అవగాహన పెంచుకుని తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటూ ఈరోజు ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రశ్నించారు. మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. విమానాలు, ఓడరేవులు, రైల్వేలు, లోకమంతా ప్రయివేటు. చివరకు కరెంట్ కూడా ప్రయివేటు. బోర్ మోటార్ల కాడా మీటర్లు పెట్టాలని ఆర్డర్ చేశారు. నేను చెప్పిన పాణం పోయినా తల తెగిపడ్డా పెట్టను అని చెప్పను. ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తానని చెప్పాడు. అలా ఐదేండ్లకు కలిసి రూ. 25 వేల కోట్లు నష్టం చేసిండు.. అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే అంటూ.. సభల్లో పదే పదే కర్ణాటకలోని పరిస్థితులను ఎత్తిచూపుతూ తాను చేసిన అభివృద్ధిని చెప్పకనే చెబుతున్నారు. అలాగే.. కులాల వారీగా.. వర్గాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుని అందరినీ ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రైతులను ఉద్దేశించి.. మనకు రావాల్సింది రాకుండా.. మీటర్లు పెట్టలేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిలబడాలి. రైతులు ఆగమైపోయారు. రైతులు కచ్చితంగా బాగుపడాలి. వ్యవసాయం బాగుండాలనే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీటర్లు పెట్టలేదు. భవిష్యత్లో కూడా మీటర్లు పెట్టం. మీటర్లు పెట్టేటోళ్లకు ఓట్లు వేయమని చెప్పాలి.. అంటూ కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తండ్రీకొడుకులు.. విపక్షాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మరి వీరి కృషి ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE