గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అనంతరం రెగ్యులర్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీలో పరిధిలో 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. 16 డివిజన్లకు మాత్రం రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఈ ఎన్నికల పలితాలతో 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ముందుగా మెహదీపట్నం డివిజన్ ఫలితాలు వెల్లడి కానున్నట్టు తెలుస్తుంది. ఈ డివిజన్లో 11,818 ఓట్లు మాత్రమే పాలవ్వడంతో తొలి ఫలితం ఇదే అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి పార్టీల అధిక్యంపై స్పష్టత రానుండగా, సాయంత్రం 5 గంటల లోపులో తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లుకు అనుమతించడం లేదు. అన్ని కేంద్రాల్లో పరిశీలనకు వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ అనంతరం ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించనున్నటు ప్రకటించారు.
అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ అధికారే తుది నిర్ణయమని, ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ అవసరమని భావిస్తే ఫలితాల ప్రకటనకు ముందే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారం హోరెత్తించడంతో గ్రేటర్ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా బల్దియా మేయర్ పీఠం దక్కించుకునేదెవరో మరి కొద్దీ గంటల్లో తేలనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ