తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని, ఈ ఎనిమిదేళ్లలో 4 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల కల్పన చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. బుధవారం హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదిక మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో గత 8 ఏళ్లలో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందిందని, కరోనా కాలంలోనూ మంచి వృద్ధి సాధించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే, వీటిలో ఒక్క హైదరాబాద్లోనే లక్షన్నర ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి నమోదైందని, ఇది జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని, ఈ క్రమంలో జూన్ 20వ తేదీన టీహబ్ రెండో దశ ప్రారంభిస్తామని వెల్లడించారు. 2021-22లో ఐటీ, అనుబంధ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లని, రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF