హైదరాబాద్ నగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు 41సీఆర్పీసీ కింద ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు రాజాసింగ్కు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఆయన అరెస్ట్ విషయంలో పాటించిన విధానం సరిగా లేదని, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నడుచుకోలేదని అభిప్రాయపడిన కోర్ట్ రాజాసింగ్ రిమాండ్ను రిజెక్ట్ చేయడమే కాకుండా ఆయనను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజాసింగ్ విడుదలవడం గమనార్హం. అయితే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మరోవైపు రాజాసింగ్, నూపుర్ శర్మ తరహాలో ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఒక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన తెలిపారు. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో యువకులు రాజాసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మరికొన్ని చోట్ల పోలీసుల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ సీపీ ఆఫీస్ మరియు పలు పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనకారులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఆయనపై పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY