ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం నాడు ప్రగతి భవన్ లో ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళితబంధు పథకం అమలుతోపాటు, దళిత వాడల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలో వున్న గ్రామ కంఠాల భూముల వివరాల జాబితా తయారు చేయాలని, దళితులకే హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
హుజూరాబాద్ లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండొద్దు, రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా అమలు:
హుజూరాబాద్ లో వారం, పదిరోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ భూముల సమస్యలు సహా దళితులకు సంబంధించిన అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని, దళిత ప్రజల డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్ ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతులను తెలియజేసే విధంగా ప్రొఫైల్ తయారు చేయాలని ఆదేశించారు.
‘‘హుజూరాబాద్ లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందకు వందశాతం అందరికీ ఇళ్ల సమస్య పూర్తి కావాలి. హుజూరాబాద్ లో ఖాళీ జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తది. తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దీన్ని అమలు చేస్తాం. హుజూరాబాద్ నియోజకవర్గ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది. అలాగే, రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్నిరకాల సమస్యలను, గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలి’’ అని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు సీఎం సూచించారు. తెలంగాణలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలని సీఎం కోరారు.
దళిత బంధు పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులుంటే సూచించాలని ప్రతినిధులను కోరిన సీఎం వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని వారిని అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకంపై మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారు? అని సీఎం వారిని ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిటి వరం అని సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందే అర్హులకు గుర్తింపు కార్డులను అందిస్తాం. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడెంటిటీ కార్డుల్లో చేర్చి పథకం అమలు తీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటం. లబ్ధిదారుడు తాను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప, ఎవరినీ జారి పడనివ్వం’’ అని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ