ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం).. అదే మజ్లిస్. గ్రేటర్ హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆ పార్టీకి తిరుగులేదు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాలు ఆ పార్టీవే. అక్కడ పోటీ ఇచ్చేవారు.. గెలిచే వారు కష్టమే. ఈసారి పార్టీలో కొత్త కొత్త మార్పులు జరిగే అవకాశలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో ఏడుగురు సిటింగ్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అయితే యాకుత్పురా అభ్యర్థికి చార్మినార్, చార్మినార్ అభ్యర్థికి యాకుత్పురా ఇచ్చి చిన్న మార్పు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వివిధ కారణాలతో ముగ్గురు మారుతారని పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నేడో.. రేపో ఆ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాతనగరంలో మజ్లిస్ హవాపై.. మ్యాంగో న్యూస్ రిపోర్ట్..
ఆ ఏడు సీట్లు పదిలం
పాతనగరంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురాతోపాటు వరుస విజయాలతో కైవసం చేసుకుంటూ వస్తున్న కార్వాన్, నాంపల్లి, మలక్పేట నియోజకవర్గాల్లో ఈసారి కూడా హవా కొనసాగించాలని మజ్లిస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో రాజేంద్రనగర్ సీటుపై మజ్లిస్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రహ్మత్బేగ్తో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయిస్తున్నారు.
కొత్త అభ్యర్థులు ?
చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారనడంలో అనుమానం లేదు. సిటింగ్లున్న మలక్పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మోయినుద్దీన్లు పోటీలో ఉంటారనే భావిస్తున్నారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని అనుకుంటున్నారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ ఈసారి పోటీ చేయరని.. ఆయన కుమారుడికి అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. యాకుత్పురా ఎమ్మెల్యే, మరో సీనియర్ నేత అహ్మద్ పాషాఖాద్రి పోటీ చేయనని ప్రకటించినట్లు సమాచారం. అయితే అధిష్ఠానం మాత్రం మరో పర్యాయం ఆయన సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్ హుస్సేన్ మేరాజ్ స్థానంలో యువనేత, మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్కు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బహదూర్పురా ఎమ్మెల్యే మోజంఖాన్ను కొనసాగిస్తారా ? లేదా ఆ స్థానం నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీకి అవకాశం ఇస్తారా ? అనే చర్చ మొదలైంది. ఒకవేళ మోజంఖాన్ను బరిలో ఉంచినా, నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ లేదా యాకుత్పురా నుంచి పోటీలోకి దించుతారని తెలుస్తోంది.
ఎంఐఎంకు కంచుకోట
నాంపల్లి నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 2009 నుంచి వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు అత్యంత కీలకం. మొన్నటి బల్దియా ఎన్నికల్లో గుడిమల్కాపూర్ డివిజన్ మినహాయించి మల్లేపల్లి, రెడ్హిల్స్, అహ్మద్నగర్, మెహిదీపట్నం, విజయనగర్ కాలనీలో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ మధ్య గత మూడు పర్యాయాలుగా రసవత్తర పోరు సాగుతోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున బరిలోకి దిగిన ఫిరోజ్ఖాన్ స్వల్ప తేడాతో ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఎంఐఎం చేతిలో మరోమారు ఫిరోజ్ఖాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తదనంతరం 2018 ఎన్నికల్లో ఫిరోజ్ఖాన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి దేవర కరుణాకర్, ఎంఐఎం నుంచి మేరాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్ రంగంలో ఉండడంతో ఎంఐఎం మరోమారు విజయాన్ని అందుకుంది. ఈసారి ఎటువంటి సంచనాలు నమోదు చేయనుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE